భగవద్గీతలో అర్జునుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ 'నేను', అనే పదాన్ని ఉపయోగించారు కానీ అర్థం, సందర్భం భిన్నంగా ఉంటాయి. అర్జునుడి 'నేను' అనేది అతని భౌతిక శరీరం, ఆస్తులు, భావాలు, నమ్మకాలను సూచిస్తుంది. అంతే కాకుండా అతని కుటుంబం, స్నేహితులు, బంధువులు కూడా ఇందులో మిళితమై ఉంటారు. మన స్థితి కూడా అర్జునుడి పరిస్థితికి భిన్నంగా లేదు. ముఖ్యంగా మనం కొన్ని వస్తువులకు యజమానులము; మరికొన్నింటికి కాము అని భావిస్తాము.
శ్రీకృష్ణుడు 'నేను' అని ఉపయోగించినప్పుడు ఇది సమగ్రతను సూచిస్తుంది. మన ఇంద్రియాల పరిమితి కారణంగా మనం గ్రహించే విభిన్న ద్వంద్వాలు, వైరుధ్యాల వల్ల అన్నింటిలో మనం విభజనలను చూస్తాము కానీ శ్రీకృష్ణుని 'నేను' ఈ విభజనల యొక్క సమ్మేళనమే. శ్రీకృష్ణుడు అదే పంథాలో కొనసాగుతూ మరొక చోట “నేను పుట్టుకతో పాటు మరణాన్ని కూడా” అని చెప్పారు.
శ్రీకృష్ణుడు సముద్రమయితే మనం సముద్రంలో బిందువుల లాంటి వాళ్ళము. కానీ అహంకారం వలన మనకు స్వంత వ్యక్తిత్వము ఉంది అనుకుంటుంటాము. ఎప్పుడైతే ఆ బిందువు తన వ్యక్తిత్వ భ్రమను త్యజించి సముద్రంలో కలిసిపోతుందో అదే మహాసముద్రం అవుతుంది. “అర్జునా! నా అవతారములు, కర్మములు దివ్యములు. అనగానిర్మలములు, అలౌకికములు. ఈ తత్త్వ రహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట ఖచ్చితంగా మరల జన్మింపడు సరికదా! నన్నే చేరును”అని శ్రీకృష్ణుడు బోధించారు (4.9). నిశ్చయంగాఈ ఉపదేశానికి అర్థం అహంకారాన్ని త్యజించి, విభజనలను ఒకటిగా అంగీకరించగలిగే సామర్థ్యం.
శ్రీకృష్ణుడు 'వీత్-రాగ్' అనే పదాన్ని ఉపయోగించారు (4.10). ఇది రాగం లేదా విరాగం కాదు; రాగాన్ని, విరాగాన్ని అధిగమించి ఆ రెండింటిని ఒకటిగా అనుభవ స్థాయిలో చూడగలిగే మూడవ స్థితి. భయక్రోధాలకు కూడా ఇది వర్తిస్తుంది.
శ్రీకృష్ణుడు 'జ్ఞాన-తపస్సు' అనే మరో పదాన్ని ఉపయోగిస్తారు. తపస్సు అనేది క్రమశిక్షణతో కూడిన జీవన విధానం తప్ప మరొకటి కాదు. మనలో చాలా మంది దానిని పాటిస్తాము. ఇంద్రియ సుఖాలు, భౌతిక ఆస్తులను పొందడానికి తీవ్రమైన అన్వేషణనే అజ్ఞానముతో చేసిన తపస్సుగా చెప్పవచ్చు. మారుతుంది. జాగరూకతతో కూడిన క్రమశిక్షణ అనే జ్ఞాన-తపస్సును కొనసాగించమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తున్నారు.
“ఇదివరలో కూడా సర్వదా రాగభయక్రోధ రహితులైన వారు (వీతరాగభయక్రోధా) దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై, పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి” (4.10) అని శ్రీకృష్ణుడు చెప్పారు.