ఒక కాయ చెట్టు నుండి పోషకాలను గ్రహిస్తూ వృద్ధి చెందుతుంది. తరువాత అది తన స్వంత ప్రయాణాన్ని ప్రారంభించడానికి చెట్టు నుండి వేరు అవుతుంది. విత్తనము నుంచి చివరకు చెట్టుగా మారేవరకు, వివిధ దశలను కలిగి ఉంటుంది. మరోవైపు, అపరిపక్వ కాయ పండే వరకు, అంటే తన యాత్రను స్వయంగా ఆరంభించే దక్షత వచ్చేవరకు చెట్టుకు అంటిపెట్టుకుని ఉండాలి.
పండిన పండు, అపరిపక్వమైన కాయను చెట్టును విడిచి పెట్టడానికి
ఆకర్షించకూడదు ఎందుకంటే అపరిపక్వ కాయ స్వతంత్ర ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంకా సిద్ధంగా లేదు. మాతృచెట్టు నుండి అవసరమైన పోషణ పొందడానికి సమయం కేటాయించకపోతే అది నశిస్తుంది. ఈ పోషణ పండిన పండు నుంచి పొందే అవకాశం లేదు. ఇదే పంథాలో, శ్రీకృష్ణుడు పరమాత్మస్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా, తాను కూడ శాస్త్ర విహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే
చేయింపవలెను” అని సలహా ఇస్తారు (3.26).
ఇది కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించే వ్యక్తుల గురించి శ్రీకృష్ణుడు చెప్పిన 3.6 వ శ్లోకానికి యొక్క కొనసాగింపు. అలా నియంత్రించిన తర్వాత వారి మనస్సు ఇంద్రియ వస్తువుల ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటే వారు తమను తాము మోసగించుకునే కపటులని శ్రీకృష్ణుడు పిలుస్తారు. ఒక జ్ఞాని, బలవంతంగా ఒక అజ్ఞాని చేత పనులను నిలువరించినప్పటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది.
వంద మంది విద్యార్థులున్న తరగతిలో, ఒక్కొక్కరు పాఠాన్ని
వారి వారి స్వభావం, మానసిక స్థితిని బట్టి ఒక్కో విధంగా అర్ధం చేసుకుంటారు. అందుకే, జీవితంలో ప్రేరేపిత కర్మల యొక్క
వ్యర్ధతను గ్రహించిన సన్యాసి, బ్రహ్మచారిని కుటుంబ జీవితం
నుండి వైదొలగమని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే బ్రహ్మచారి తన స్వంత కర్మల ద్వారా అదే వ్యర్ధతను బాగా అర్థం చేసుకోవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు.
శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించడానికి అర్జునుడిలో నేర్చుకోవాలనే కుతూహలం కోసం ఎదురుచూశాడు. అప్పటి వరకు, శ్రీకృష్ణుడు అతన్ని ప్రాపంచిక క్రియలు చేస్తూనే ఉండనిచ్చారు, జీవితంలో సుఖదుఃఖాలు అనుభవించనిచ్చారు; అనుకూలమైన క్షణం కోసం వేచి ఉన్నారు. అంతర్గతకుతూహలం జన్మించినప్పుడే మనం చూసే ప్రతి వాస్తవికత, మనం ఎదుర్కొనే ప్రతి జీవిత పరిస్థితి గురువుగా మారగల అవకాశం ఉంది; అటువంటి సమయంలోనే నేర్చుకోవడం సాధ్యం అవుతుంది.