సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పుణుకుల బుట్టలో లచ్చితల్లి."
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని మూడవ కథ.
పుణుకుల సుబ్బాయి బతకనేర్చినవాడు. జంగిడీలో మోసుకొచ్చిన వేడి వేడి పుణుకులకు మరి కాసిని వేడి కబుర్లు జోడించి ఒకటో నాలుగో డబ్బులు చేసుకోవటం, వరసగా ఆల్ కౌంటైనా ఆలి కంటె అమ్మైనా సరే మరోసారి ఓడిపోవాలనే పేకాట వ్యసనపరులకు, వాళ్ళు తిన్న పుణుకులకు వసూలైన డబ్బులు వాళ్ళకే వడ్డీలకు తిప్పి, అటునుండీ సారాకొట్టు కాడ జేబులు ఖాళీ అయినా కళ్ళు, మనసులతో సాకీని వెతికే సరసులకు అప్పులిచ్చి, ఆ అప్పూర్ణాదేవి దయతో అంచెలంచలుగా ఎదిగి లక్షాధికారైన వైనం. అంత ఎదిగినా ఆ ఎదుగుదల తన మూలాలను మరవనివ్వకుండా రోజూ చేసే పూజా పాఠం!
సుబ్బాయి బతకనేర్చినతనమంటే మనకు కలిగేది చిన్నచూపు కాదు. ప్రతివారూ అదే లోకజ్ఞానంతో, అంతే జాగ్రత్తపరులై మెలగాలన్న గౌరవం. ఇలాగే కష్టపడి పైకెదిగిన ఎందరో మన మధ్య మనకు పరిచయమైనవారు కూడా ఉంటారు సమాజంలో. వారందరి దూరదృష్టి, ఆర్థిక క్రమశిక్షణలకు ఈ కథ ఒక మెచ్చికోలు అనుకుందాం.
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.